AP Government Schools: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతోంది. ఇటీవల ప్రైవేట్ పాఠశాలల నుంచి లక్షకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు.
అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర అధ్యయనం చేసి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి లోకేష్.. విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేష్ తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు ఏఐ ట్యూటర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు వ్యక్తిగత అభ్యాసంలో మరింత సహాయం అందుతుందని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, కూటమి ప్రభుత్వం విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి లోకేష్.. సంస్కరణలు తీసుకొస్తూ.. విద్యారంగంలో కీలక మార్పులు తెచ్చే విధంగా కృషి చేస్తోన్న విషయం విదితమే..

