AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు

Ap Govt

Ap Govt

AP Employee Transfers Ban: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు బదిలీలతో పాటు కొత్త నియామకాలు, పదోన్నతులు (ప్రమోషన్లు), డిప్యుటేషన్లపై కూడా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణ, కేడర్ సంఖ్య ఖరారు, ఉద్యోగుల పంపిణీ, అమలు మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ‘రాష్ట్రపతి ఉత్తర్వు–2025’ ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలకు స్థానిక కేడర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

అయితే, మార్కాపురం, పోలవరం జిల్లాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వు–2025 పరిధిలోకి రావని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తామని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ను 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజన

కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

మల్టీ జోన్ – 1
జోన్–1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు
జోన్–2: తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి
జోన్–3: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు

ఈ జోన్‌లో అమరావతి రాజధాని ప్రాంతం కూడా ఉంటుంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల మధ్య పోస్టుల పంపిణీకి ప్రత్యేక నిష్పత్తి అమలు చేయనున్నారు.

మల్టీ జోన్ – 2
జోన్–4: బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్–5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్–6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి

కర్నూలు, నంద్యాల జిల్లాల మధ్య పోస్టులను 55:45 నిష్పత్తిలో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక, ఈ మార్గదర్శకాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు పోస్టులకు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.