AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం రేపు అనగా గురువారం రోజు జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ ప్రతిపాదనలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో సెంట్రల్‌ లైబ్రరీ, కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.596 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.533 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరగనుంది. రైతుల ప్లాట్లలోని చిన్న రహదారులకు సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు నిర్మించేందుకు సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌కు అమరావతిలోని స్టోరేజ్‌ ట్యాంకుల నుంచి తాగునీరు అందించే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది.

రాజధానిలోని వివిధ గ్రామాల్లో 42 ఎకరాల భూమిని ప్రైవేట్‌ సంస్థల ద్వారా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా కేబినెట్‌ ముందుకు రానుంది. తాడికొండ, కంతేరు గ్రామాల్లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్‌ కోసం అవసరమైన భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సమీకరించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక, కేబినెట్‌ అజెండా అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తాజా పరిస్థితులు, సుప్రీంకోర్టు ప్రక్రియ తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.