AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతులు, అమరావతి రాజధాని అభివృద్ధి, రహదారులు, రైల్వే లైన్, వరద నష్టం పునరుద్ధరణ, వైద్య, న్యాయ రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అమరావతి మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన భూసమీకరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు..
రైతులకు గుడ్ న్యూస్..
తోతాపురి మామిడి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు రూ.281 కోట్ల మద్దతు ధర నిధులు అందించాలని నిర్ణయించారు. మార్క్ఫెడ్ ద్వారా స్వల్పకాలిక రుణాలు అందించేందుకు కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. రైతులకు సంబంధించిన అన్ని అంశాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక, పొగాకు రైతులకు రూ.94 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్క్ఫెడ్ ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
6,212.50 ఎకరాల భూసమీకరణకు ఆమోదం
అమరావతిలో రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్, గ్రిడ్ రోడ్ల విస్తరణ కోసం మొత్తం 6,212.50 ఎకరాల భూసమీకరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కంతేరు గ్రామంలో 974 ఎకరాలు, తాడికొండ గ్రామంలో 5,238.50 ఎకరాలు భూసమీకరణ చేయనున్నారు. ఎర్రుపాలెం–నంబూరు మీదుగా కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. రైల్వే మార్గానికి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున మొత్తం 100 మీటర్ల బఫర్తో భూముల సేకరణ చేపట్టనున్నారు. రైతుల విజ్ఞప్తుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రూ.759.79 కోట్లతో అమరావతి సంగమం
అమరావతిలోని శాఖమూరులో రూ.759.79 కోట్లతో అమరావతి సంగమం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, సుపరిపాలన సంస్థలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు డీపీఎల్ నుంచి రూ.310.08 కోట్లు, ఏపీహెచ్ఆర్డీఐ నుంచి రూ.277.94 కోట్లు, ఏపీ సీఆర్డీఏ నుంచి రూ.171.76 కోట్లు సమకూర్చనున్నారు.
ఎల్పీఎస్ రోడ్లపై కీలక నిర్ణయం
అమరావతి రాజధాని నగరంలోని ఎల్పీఎస్ రోడ్ల నిర్మాణంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సిమెంట్ కాంక్రీట్ రోడ్ల స్థానంలో బిటుమినస్ రోడ్లను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది.
నాలుగు జిల్లాల్లో వరద నష్టం పనులు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు. నాలుగు జిల్లాల్లో మొత్తం 78 వరద నష్టం పనులకు రూ.6.25 కోట్లను కేటాయించనున్నారు. మరోవైపు.. వెలిగొండ టన్నెల్-2 వద్ద బోరింగ్ యంత్రాన్ని తొలగించేందుకు రూ.11.63 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ నిధులను వినియోగించనున్నారు.
న్యాయ, వైద్య రంగాల్లోనూ కీలక నిర్ణయాలు
మంగళగిరి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కోర్టుకు 21 పోస్టులు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి ఆధునీకరణ ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో న్యాయ, వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

