AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం

  • ఏపీ టూరిజానికి బిగ్ బూస్ట్..
  • ఐఏటీవోతో చారిత్రాత్మక ఒప్పందం..
  • విశాఖలో 41వ ఐఏటీఓ సదస్సు..
  • వెయ్యి మంది అంతర్జాతీయ డెలిగేట్లతో టూరిజం సదస్సు..
Ap Govt

Ap Govt

AP Tourism: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర పర్యాటక శాఖ మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం నేపథ్యంలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన 41వ ఐఏటీవో వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభించనుంది.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా ఐఏటీవోతో ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. 41వ ఐఏటీవో వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటక రంగాన్ని ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖలో జరిగే ఈ సదస్సుకు దాదాపు వెయ్యి మంది అంతర్జాతీయ టూరిజం డెలిగేట్లు హాజరవుతారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశముందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం పొందుతుందని పేర్కొన్నారు.

×
×
Ad

ఐఏటీవోతో కుదిరిన ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడతాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని స్థానిక టూర్ ఆపరేటర్లకు కూడా ఈ ఒప్పందం ద్వారా భారీ ఊరట లభించనుంది. ఐఏటీవో సభ్యత్వ రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం ప్రత్యేక రాయితీ కల్పించగా, స్థానిక టూర్ ఆపరేటర్ల కోసం రూ.10,000 జాయినింగ్ ఫీజును పూర్తిగా మినహాయించినట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటికే పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని పేర్కొన్నారు కందుల దుర్గేష్‌. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసం కారణంగా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖలో జరగనున్న ఐఏటీవో సదస్సు ద్వారా జాతీయ ట్రావెల్ ట్రేడ్, పర్యాటక రంగ అగ్రనేతల ముందు ఆంధ్రప్రదేశ్‌లోని వైవిధ్యభరితమైన పర్యాటక గమ్యస్థానాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక మరియు వారసత్వ సంపదను ప్రదర్శించే అరుదైన అవకాశం లభించనుంది.