COVID-19: ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ వెల్లడించారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో చెదురుముదురుగా నమోదయ్యాయని, ఒకే ప్రాంతంలో క్లస్టర్ రూపంలో వ్యాప్తి చెందలేదని స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో తొలి కరోనా కేసు జూన్ 26న కడప జిల్లాలో నమోదైంది. అనంతరం జూలై 1 నుంచి 16వ తేదీ వరకు మరో 11 కేసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 కేసులు, విశాఖపట్నం మరియు కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయని, ఎక్కడా సామూహిక వ్యాప్తి కనిపించలేదని వీర పాండియన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదైన 12 కేసుల్లో ముగ్గురు ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉండగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో కరోనా పాజిటివ్గా తేలిన నలుగురు మరణించారు. వీరిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. అయితే వీరందరికీ ముందే తీవ్ర రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వారి మరణాలకు కేవలం కరోనా ఒక్కటే కారణమని చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.
వైరస్ స్వరూపాన్ని గుర్తించేందుకు ఐదు నమూనాలను జూలై 9న పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV)కు జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ వేరియంట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో మొత్తం 67 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో వ్యక్తికి తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ కావడంతో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 12కు చేరింది.
దేశవ్యాప్తంగా కూడా జూలై 1 నుంచి ఇప్పటివరకు 339 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదుకాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.

