AP Cabinet Meeting: ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అమరావతి సచివాలయానికి చేరుకోనున్నారు.. ఇక, కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానుంది.. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన 25కి పైగా కీలక ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
యూఏఈతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, పరస్పర సహకారంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశముంది. అలాగే ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కొందరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. విమానాశ్రయానికి విస్తృత ప్రచారం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో APPSC, APSLPRB ద్వారా 3,168 ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే 50 ఏళ్లలోపు చేనేత కార్మికుల కోసం ‘నేతన్న భరోసా’ పథకానికి ఆమోదం తెలిపి, ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను పరిశీలించనున్నారు. వంశధార నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.641.10 కోట్ల ప్రతిపాదన, హంద్రీ-నీవా ఫేజ్-2 వ్యయాన్ని రూ.312 కోట్లకు పెంచే ప్రతిపాదన, గోదావరి పుష్కరాల భద్రత కోసం రూ.50 కోట్ల మంజూరు అంశాలపై కూడా చర్చ జరగనుంది. బాపట్లలో వికలాంగుల డిగ్రీ కళాశాల ఏర్పాటు, రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.
అదే విధంగా విశాఖ, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో భూ కేటాయింపులు, అదానీ, గ్రీన్కో, AM గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, అనకాపల్లి VMRDA ల్యాండ్ పూలింగ్ రైతులకు పరిహారం, ఫైర్ సర్వీసుల ఆధునీకరణ, మార్క్ఫెడ్కు రూ.300 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ, విశాఖ జిల్లా ఎండాడలో AIG హాస్పిటల్స్కు 2.16 ఎకరాల భూమిని రూ.45.99 కోట్లకు కేటాయించే ప్రతిపాదనలపై కూడా మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

