Andhra Pradesh New Map: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా నిర్మాణంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ, తాజాగా 28 జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్ర మ్యాప్ విడుదలైంది. ఈ మ్యాప్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈ కొత్త మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం.
Read Also: Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్రావు మాస్ రియాక్షన్..
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మ్యాప్ విడుదలైంది. దీంతో అమరావతి రాజధాని హోదా మరింత బలపడినట్లైంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం జిల్లాల సంఖ్యను 28కి పెంచారు. ఈ రెండు కొత్త జిల్లాలను కూడా తాజా మ్యాప్లో చేర్చడం ద్వారా రాష్ట్ర భౌగోళిక నిర్మాణంలో మార్పులు ప్రతిబింబించాయి.
ఇక, అమరావతిని గుంటూరు జిల్లాలో భాగంగా చూపిస్తూ కొత్త మ్యాప్ రూపొందించడం మరో ముఖ్య అంశంగా నిలిచింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన సులభతరం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొత్త మ్యాప్ విడుదలతో రాష్ట్ర పరిపాలనలో స్పష్టత పెరగడమే కాకుండా, భవిష్యత్ ప్రణాళికలకు కూడా ఇది మార్గదర్శకంగా నిలవనుంది.
