Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..

  • బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం..
  • విశాఖతో సహా, ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..
Earthquake

Earthquake

Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. విశాఖపట్నం సహా పొరుగున ఉన్న అన్ని జిల్లాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5.05 గంటల ప్రాంతంలో వైజాగ్‌లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గాజువాక, మంగళపాలెం, సాగర్ నగర్, పెద్ద వాల్తేరు, అరిలోవ, ఎంవీపీ కాలనీలతో సహా ఇతర ప్రాంతాల్లో ప్రకంపలు ప్రభావం కనిపించింది.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించినట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (భూకంప పరిశోధన కేంద్రం) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం ఉదయం 5:05:46 గంటలకు (IST) 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు బంగాళాఖాతంలోని కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంప కేంద్రం 16.805 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 84.381 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది.

భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించిట్లు సమాచారం. తక్కువ లోతులో సంభవించిన భూకంపంగా నిపుణులు దీనిని చెబుతున్నారు. భూగర్బ నిర్మాణాల్లో సర్దుబాట్ల కారణంగా ఈ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.