ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటితో వెయ్యిరోజులు పూర్తవుతోంది. వెయ్యి రోజుల పాలనలో సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పథకాలతో పాటు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
మరోవైపు వెయ్యి రోజుల పాలనలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాలను ప్రవేశపెట్టడం జగన్ పాలనలో మైలురాళ్లు అని అభివర్ణించాలి. ఏపీలో జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించగా ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. అటు ఇటీవల మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విశాఖ కేంద్రంగా ఏపీ రాజధానిని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు.
