NTV Telugu Site icon

బీరువాలో లక్షదాచిన వృద్ధుడు… ఆ తర్వాతేమైంది?

విధి ఆడే చదరంగంలో మనం ఓడిపోతూ వుంటాం. అన్నీ బాగున్నాయనుకునేలోపే అంచనాలు తలక్రిందులవుతాయి. కష్టపడి డబ్బు ఒక్కోసారి అక్కరకు రాకుండా పోతుంది. గుండె ఆపరేషన్ కొరకు కష్ట పడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు చెదలు పట్టి నాశనం అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా వుంటుంది. నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీ కి చెందిన షేక్ మహబూబ్ బాషాకి అలాంటి పరిస్థితి ఎదురైంది.

నాలుగు నెలలు క్రితం గుండె ఆపరేషన్ కొరకు ఇంటిలో ఉన్న పాడి గేదెలు విక్రయించగా వచ్చిన లక్ష రూపాయలు చాలక మరికొంత డబ్బులు కోసం తిరుగుతున్నాడు.

లక్ష రూపాయలు ఇంటిలోని బీరువాలో దాచుకున్నాడు. ఈ లోపు మిగిలిన డబ్బులు ఆపరేషన్ కోసం సమకూర్చుకున్నాడు. ఆదివారం బీరువా లో దాచుకున్న లక్ష రూపాయలు డబ్బులు బయటకు తీయగా చెదులు పట్టి డబ్బులు ముక్కలుముక్కలుగా చినిగిపోయాయి. ఆ సీన్ చూసిన వృద్ధుడికి షాక్ తగిలినట్టయింది.

దీంతో మహబూబ్ బాషా లబోదిబోమంటున్నాడు. చెదలు పట్టిన లక్ష రూపాయల్లో 500,200,100 నోట్లు ఉన్నాయి. తన కష్టం చెదలు తినేశాయని, తనను ఎవరు ఆదుకుంటారని కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఇంతకుముందు కృష్ణాజిల్లా మైలవరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి తాను కష్టపడి సంపాదించుకున్న ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లను ట్రంకు పెట్టెలో దాచుకోగా చెదలు తినేశాయి.