NTV Telugu Site icon

Jewellery Prices: ఏప్రిల్‌ నుంచి ఖరీదు కానున్న ఆభరణాలు

Jewellery Prices

Jewellery Prices

Jewellery Prices: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌లో.. విలువైన లోహాలతోపాటు బంగారం, వెండి, ప్లాటినం వస్తువులు మరియు ఇమిటేషన్‌ ఆభరణాలపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచారు. 2023-24 బడ్జెట్‌లో ఈ దిగుమతి పన్నును 22 శాతం నుంచి 25 శాతానికి చేర్చారు. దీంతో నగల రేట్లు పెరగనున్నాయి. ఈ నిర్ణయం.. గోల్డ్‌, సిల్వర్‌, ప్లాటినం ధరలతోపాటు డిమాండ్‌ పైన కూడా ప్రభావం చూపనుంది. ముడి ఖనిజాలను శుద్ధి చేసే కర్మాగారాలకు కూడా నష్టం కలిగించనుందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ పేర్కొంది.

మన దేశం ఈ విలువైన లోహాల విషయంలో ఎక్కువగా దిగుమతుల పైనే ఆధారపడి ఉండటంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. గతేడాది జులైలో బంగారం దిగుమతులపై ట్యాక్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారే 5 శాతం పెంచింది. ఏడున్నర శాతం నుంచి పన్నెండున్నర శాతానికి తీసుకెళ్లింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు పెంచింది. వెండి మీదున్న ఏడున్నర శాతం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పది శాతం చేసింది. దిగుమతులపై అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌.. AIDCని.. రెండున్న శాతం నుంచి ఐదు శాతానికి పెంచింది.

read more: Special Story on Amazon’s Logistics Business: ట్రక్కులు, ఓడలు, విమానాల్లో డెలివరీ

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జెమ్‌ అండ్‌ జ్యూలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ స్పందించింది. గోల్డ్‌, సిల్వర్‌, ప్లాటినం దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేసినా సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ సంక్షేమం దృష్ట్యా తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే వరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని కౌన్సిల్‌ తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా.. ప్రయోగశాలలో వజ్రాల తయారీకి ఉపయోగించే సీడ్స్‌పై కస్టమ్స్‌ డ్యూటీని 5 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించారు.

దీంతో.. ఈ నిర్ణయం.. గోల్డ్‌ డిమాండ్‌కి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రయోగశాలల్లో వజ్రాల తయారీని ప్రభుత్వం.. టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సెక్టార్‌గా భావిస్తోందని, అధిక ఉపాధికి అవకాశం ఉన్న రంగంగా పరిగణనలోకి తీసుకుంటోందని చెప్పారు. ల్యాబుల్లో రూపొందించే ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ డైమండ్లు.. ఆప్టికల్‌ పరంగానే కాకుండా కెమికల్‌ పరంగా కూడా నేచురల్‌ డైమండ్ల లక్షణాలనే కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లో వజ్రాల తయారీకి వాడే సీడ్స్‌ మరియు పరికరాల ఉత్పత్తిని దేశీయంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ రంగంలో దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక ఐఐటీకి ఐదేళ్లపాటు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ గ్రాంట్‌ను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ల్యాబుల్లో రూపొందించే డైమండ్లు చౌకగా దొరుకుతుండటంతో ప్రజాదరణ లభిస్తోందని, ఫలితంగా సహజ వజ్రాలకు గిరాకీ తగ్గి బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ డైమండ్లకు డిమాండ్‌ పెరిగితే న్యాచురల్‌ డైమండ్లను పెట్టుబడి సాధనాలుగా భావించేవారి సంఖ్య తగ్గుతుందని, అది చివరికి బంగారానికే మంచి చేస్తుందని తెలిపారు.