“పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే” – ఇది గోదావరి జిల్లాల్లో పులస చేపకు ఉన్న క్రేజ్ గురించి చెప్పే ఒక ప్రసిద్ధ సామెత. ప్రపంచంలో ఎక్కడో పుట్టి, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి తీరానికి వచ్చే ఈ చేప, కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చే ఎర్రటి వరద నీటిలో ఈదుకుంటూ వచ్చే పులసలు, ఆ సీజన్లోనే కనిపిస్తాయి. కానీ.. కాలం కాని కాలంలో, ఎండలు మండుతున్న ఏప్రిల్ మాసంలో గోదావరి తీరాన పులస ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం వద్ద గోదావరిలో వేట సాగిస్తున్న ఒక మత్స్యకారుడి వలకు అనుకోకుండా ఒక పులస చిక్కింది. అది సీజన్ కాకపోవడంతో మార్కెట్కు రాగానే జనం దానిని చూసేందుకు ఎగబడ్డారు. ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆ రుచిని ఆస్వాదించాలనే తపనతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. పరిమాణంలో చిన్నదే అయినా.. ఈ అరుదైన లభ్యత కారణంగా ఆ ఒక్క చేప ఏకంగా రూ. 4,000 ధర పలికింది. పులస ప్రియుడొకరు వెనుకాడకుండా ఆ మొత్తాన్ని చెల్లించి దానిని సొంతం చేసుకున్నారు.
Also Read:Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..
పులస చేప కేవలం రుచికే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎంతో విశిష్టమైనది. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.
శరీర కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన నాణ్యమైన ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఈ చేపలోని పోషకాలు మెదడు చురుగ్గా పనిచేయడానికి.. జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడతాయి. సముద్రం నుంచి నదిలోకి వచ్చే క్రమంలో ఈ చేప తన శరీరంలోని ఉప్పును కోల్పోయి.. అద్భుతమైన రుచిని సంతరించుకుంటుంది. అందుకే దీని పులుసు మరుసటి రోజు తింటే ఇంకా రుచిగా ఉంటుంది.
సాధారణంగా ఏప్రిల్ నెలలో పులస దొరకడం అనేది అత్యంత అరుదైన విషయం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ రాజసం లాంటి చేప, సీజన్ కాకపోయినా తన డిమాండ్ను ఏమాత్రం తగ్గించుకోలేదని మరోసారి నిరూపితమైంది.
