దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ జంట పెళ్ళి చేసుకున్న విధానం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని రాట్లంకు చెందిన వధూవరులు ఇద్దరూ కరోనా కారణంగా పీపీఈ కిట్లు ధరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పెళ్ళి జరిపించే పండితుడితో పాటు ముగ్గురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 19న వరుడికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాహాన్ని ఆపడానికి ఆ ప్రాంతం తహసీల్దార్ ప్రయత్నించారట. కానీ వారి కుటుంబ సభ్యుల ఈ పెళ్లిని ఆపకూడదని రిక్వెస్ట్ చేశారట. అంతేకాకుండా ఈ వేడుకలో వధూవరులిద్దరూ పీపీఈ కిట్లు ధరించడంతో కరోనా వ్యాప్తికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అధికారులు, పోలీసుల అనుమతితోనే ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ పెళ్ళిపై నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్ళి అవసరమా ? అంత తొందరేం వచ్చింది… కొన్ని రోజులు అగలేకపోయారు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వరుడికి కరోనా… అయినా వధువుతో కలిసి ఇలా…!
