Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో అత్యంత దారుణమైన, విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదం మూడు విలువైన ప్రాణాలను బలిగొనగా, ప్రస్తుతం ఆ ఇంట్లో వాళ్ల ముద్దుల పెంపుడు కుక్క మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. గత 24 గంటలుగా అది తన యజమానుల రాక కోసం ఆవేదనతో ఎదురుచూస్తోంది. ఈ ఘోర ఘటనా వివరాల్లోకి వెళ్తే.. వాలుజ్ MIDC పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ ప్రాంతంలో నివసించే మురళీధర్ చాంద్గుడే (48), ఆయన భార్య సంగీతకు 19 ఏళ్ల కుమారుడు కుణాల్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కొత్త ఐఫోన్ (iPhone) కొనివ్వాలంటూ కుణాల్ తన తల్లిదండ్రులతో గొడవపడి, తీవ్ర కోపంతో ఇంటి సమీపంలోని కొండపైకి వెళ్లాడు. కుమారుడి భద్రతపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతనికి నచ్చజెప్పి ఇంటికి తీసుకురావడానికి కొండపైకి వెళ్లారు.
సమాచారం అందుకున్న స్థానిక గ్రామస్తులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది కొండ కింద రక్షణ వలయాన్ని (Safety Net) ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కుణాల్ రాతి అంచులపై స్థానాలు మారుస్తూ ఉండటంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తండ్రి మురళీధర్ కొండ అంచున ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లేసరికి, కుణాల్ కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. తండ్రి అతడిని కాపాడేందుకు చేతిని పట్టుకోగా, ఇద్దరి బ్యాలెన్స్ తప్పి సుమారు 300 అడుగుల లోతైన కొండపై నుంచి కిందకు పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు కొండపై నుంచి కిందపడిపోవడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి సంగీత కూడా మరుక్షణంలోనే కొండపై నుంచి దూకేసింది. తీవ్రగాయాలపాలైన ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ముగ్గురి మరణం తర్వాత ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ల పెంపుడు కుక్క మాత్రమే మిగిలింది. కుణాల్కు తన పెంపుడు కుక్కతో ఎంతో అనుబంధం ఉండేది, ప్రతిరోజూ ఉదయం దానిని వాకింగ్కు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు తనను ఆప్యాయంగా చూసుకునే యజమానులు తిరిగిరారనే నిజం తెలియక ఆ మూగజీవి విలవిలలాడుతోంది. శుక్రవారం నుంచి అది గట్టిగా అరుస్తూ, తిండి తిన్కుండా, నీళ్లు తాగకుండా ఆవేదన వ్యక్తం చేస్తోందని పొరుగువారు తెలిపారు. వారు ఆహారం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఏమీ తినలేదు. కొన్ని రోజుల క్రితం వరకు నవ్వులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించగా, ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ మూగజీవి అరుస్తున్న తీరు స్థానికులను కలచివేస్తోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ శునకాన్ని బయటకు తీసి దానికి తగిన సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పొరుగువారు పోలీసులను కోరారు. కొన్ని నెలల క్రితమే ఈ కుటుంబం ఇక్కడికి అద్దెకు వచ్చిందని, మురళీధర్ ట్రక్ డ్రైవర్గా పనిచేసేవారని హౌస్ ఓనర్ ఆదిత్య దేశ్పాండే తెలిపారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఇలాంటి విషాదం నిండుతుండని ఎవరూ ఊహించలేకపోయారు. యజమానులు ఇక లేరనే చేదు నిజం తెలియక, ఆ విశ్వసనీయమైన పెంపుడు కుక్క ఇప్పటికీ ఆ ఖాళీ ఇంట్లోనే వారి రాక కోసం ఎదురుచూస్తోంది.

