దేశంలో హిందీ భాషా వివాదం నడుస్తోంది. కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య మొదలైన హిందీ భాషా వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని స్పందించారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. హిందీ భాష అనేది మంచి లాంగ్వేజ్ అని.. అది కూడా నేర్చుకోవాలని.. అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్లు అని.. వాళ్లతో మాట్లాడాలంటే తాము కూడా హిందీ నేర్చుకోవాల్సిందేనన్నారు.
తమిళం వాళ్లు కూడా మంచివాళ్లేనని.. అయితే హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషం అని సుహాసిని అన్నారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, కొంతమంది హిందీ మాట్లాడతారని.. తనకు ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు.
అయితే నటి సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందీ భాష నేర్చుకోవాలన్న సుహాసిని వ్యాఖ్యలను తప్పుపడుతోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా సుహాసినిని పలువురు ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలని అనిపిస్తే సుహాసిని హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఇప్పటికే హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాబోదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.