Toll Plaza Prices: మొదలైన టోల్ బాదుడు.. వాహనదారుల జేబుకు చిల్లు

Pantangi Toll Plaza

Pantangi Toll Plaza

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదిన నుంచి టోల్‌ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో పెరిగిన టోల్‌ చార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతీ ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా టోల్‌ ఛార్జీలు పెంచనున్నారు.

ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాల్లో పెరిగిన ఛార్జీలు అమలులోకి వచ్చాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాలకు కొత్త ఛార్జీలను వసూలు చేస్తున్నారు. సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.

కాగా, ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యుడి జీవితం పెను భారం పడుతోంది. ఇప్పుడు టోల్ ఛార్జీలు కూడా పెరగడంతో సామాన్యుడి జేబులకు చిల్లు పడడం ఖాయం.