దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు శనివారం అర్ధరాత్రి కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4:30 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
Read Also: మరోసారి పెరిగిన బంగారం ధరలు
సాంకేతిక అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని ఖాతాదారులను ఎస్బీఐ కోరింది. ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే తరహాలో మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కాగా దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22వేల బ్యాంక్ శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి.
