టీయస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ… యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం, ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరు. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలి. టీఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని, అందుకే నటునికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నాం. అని చెప్పారు.