భారత్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సెమీస్ ఆశలు సజీవం

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

టీమిండియా విధించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో కివీస్ చేధించింది. ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు విజయం అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హార్డిక్ పాండ్యా రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైన టీమిండియా వరల్డ్ కప్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.