బీజేపీ నేతలకు సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌లకు జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మన దేశం అభివృద్ధిలో అమెరికాను దాటుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాల లాంటివి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. అమలవుతున్నట్లు నిరూపిస్తే ఆయనతో పాటు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు రాజీనామాలకు సిద్ధమని ఆయన సవాల్‌ చేశారు. నిరూపించకపోతే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌లు రాజీనామా చేయాలని ఆయన డిమండ్‌ చేశారు.