నేడు సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్‌..

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ వైపీసీ ఎమ్మెల్యే సినిమా వాళ్లపై చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. దీనిపై తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలోని నిర్మాతలు స్పందించి సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్నామధ్య మెగాస్టార్‌ చిరంజీవిని సినిమా ఇండ్రస్టీకి పెద్దగా ఉండాలని కొందరు కోరగా.. నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని.. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా ముందుంటానని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో మెగాస్టార్‌ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నేడు సీఎం జగన్‌ను చిరంజీవి కలవనున్నారు.

అయితే సినిమా టిక్కెట్ల ధరలపై సీఎం జగన్‌తో మెగాస్టార్‌ భేటీకానుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ కూడా మొన్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. కానీ ఆ భేటీలో ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఈ రోజు ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చిరంజీవి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకొని సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. మెగాస్టార్‌ చిరంజీవికి సీఎం జగన్‌ లంచ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.