సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్లో మంటలు చెలరేగాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులుకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. క్లబ్లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర్లో ఉండటంతో అటుగా వాహనాల రాకపోకలు పోలీసులు నిషేధించించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 1879లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మాణం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్ క్లబ్ నిర్మాణం జరిగింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్ కవర్ విడుదల చేశారు. సికింద్రాబాద్ క్లబ్లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ క్లబ్లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.
