మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఇక లేరని చెబుతున్నారు పోలీసులు.. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆర్కే.. ఇవాళ కన్నుమూశారని తెలుస్తోంది.. ఇక, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు రామకృష్ణ.. చాలా సమయాల్లో పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతూ వచ్చింది. కానీ, మళ్లీ ఆయన కదలికలపై వార్తలు వచ్చేవి.. అయితే, గత రెండేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు… ఈ నేపథ్యంలోనే ఆయన మృతిచెంది ఉంటారని సమాచారం.
తీవ్ర అనారోగ్య సమస్యలతో బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతిచెందినట్టు బస్తర్ పోలీసులు చెబుతున్నారు.. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైనా ఆర్కేపై రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు ఆర్కే.. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు ఆర్కే.. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక సూత్రధారిగా ఉన్నారు ఆర్కే.. అయితే, దీనిపై తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
