నేడు వరంగల్ లో జస్టిస్ ఎన్వీ రమణ టూర్

రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆయన తన సతీమణితో కలిసి సందర్శించనున్నారు. ఆలయంలోని రుద్రేశ్వర స్వామిని సీజేఐ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఆలయ సందర్శన అనంతరం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హనుమకొండకు వెళ్లి రాత్రి నిట్‌ కళాశాలలో బస చేస్తారు. అనంతరం ఆదివారం ఉదయం వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారిని సీజేఐ దంపతులు దర్శించుకుంటారు. తదుపరి హనుమకొండలో కొత్తగా నిర్మించిన పదికోర్టుల భవన సముదాయాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభిస్తారు. జస్టిస్ ఎన్వీ రమణ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.