విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం ఉదయం గ్యాస్ కలకలం రేపింది. వ్యర్థ జలాల పంప్ హౌస్లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్..
కాగా విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలు తరచూ చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మేలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఫార్మాసిటీలో చోటుచేసుకున్న తాజా ఘటన విశాఖ వాసులను మరోమారు ఆందోళనకు గురిచేసింది.