Site icon NTV Telugu

మంత్రి బాలినేనికి సీపీఐ నారాయణ కౌంటర్‌

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజ్యసభ సీటు కోసమే చిరంజీవి జగన్‌తో సమావేశమయ్యారంటూ వివిధ కోణాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ కౌంటర్‌ ఇచ్చారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. ప్రజలకు నిజాలు చెప్పండి అని నారాయణ అన్నారు. కనుమ పండుగ రోజు కూడా కఠోర వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చిరంజీవి గారేమో ప్రభుత్వం తరపు నుండి నన్నొక్కడినే ఆహ్వానించారని, అందుకే తాను వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసానంటున్నారు.

ప్రభుత్వం తరపున “తాము ఎవ్వర్ని ఆహ్వానించ లేదని,చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని,ప్రతిపక్షాలు అనవసరపు గోల చేస్తున్నాయి’అని అంటున్నారు. చిరంజీవి నిజం చెప్పారా? అబద్ధం చెప్పారా? ప్రభుత్వం చెప్పింది నిజమా?అబద్దమా? ప్రజలకు వాస్తవాలు చెప్పడంటూ నారాయణ డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యకు సంబంధిత అసోసియేషన్లను తీసుకువచ్చి చర్చించకుండా వ్యక్తిగతంగా ఒకరిని తీసుకువచ్చి మాట్లాడడం చెడు సాంప్రదాయానికి దారితీస్తుందని సలహా ఇచ్చారు.

Exit mobile version