చిన్నారులకు వ్యాక్సిన్‌.. కోవాగ్జిన్‌పై ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన

Randeep Guleria

Randeep Guleria

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… కోవిడ్‌పై పోరాటంలో భాగంగా భారత్‌లో ఇప్పటికే 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.. దాదాపు 43 కోట్ల మందికి టీకా వేశారు. ఇక, 18 ఏళ్లు లోపు వారికి వ్యాక్సిన్‌ వచ్చేది ఎప్పుడూ..? అని అంతా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేశారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా.. పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ ట్రయల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయని.. సెప్టెంబర్ నాటికి ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపారు. మరోవైపు.. టీకాల సేకరణ కోసం భారత ప్రభుత్వం.. వ్యాక్సిన్‌ తయారీదారులైన మోడెర్నా, ఫైజర్‌తో కూడా చర్చలు జరుపుతోంది. అయితే, ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యింది. ఇక, పిల్లలను వారి వయస్సు ప్రకారం వర్గాలుగా విభజించడం ద్వారా మూడు దశల్లో ట్రయల్స్‌ జరుగుతున్నాయి.. మొదటి ట్రయల్స్‌ 12-18 సంవత్సరాల వయస్సు వారిపై ప్రారంభించారు.. తర్వాత 6-12 సంవత్సరాలు.. ప్రస్తుతం 2-6 సంవత్సరాల వయస్సు గల వారిపై ట్రయల్స్‌లో జరుగుతున్నాయి..