ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందట ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ వాస్తవానికి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ నవంబర్ తొలివారంలో సీఎం జగన్ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Read Also: అనాధ పిల్లలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్‌ సర్కార్‌

ఏపీ ప్రభుత్వం పంపిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం… సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సీఎస్‌గా సమీర్ శర్మ పదవీ కాలాన్ని డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కుల్దీప్ చౌదరి ఆదివారం నాడు ఏపీ సర్కారుకు లేఖ ద్వారా వెల్లడించారు .