ఊహించని విపత్తులా వచ్చి పడిన తాలిబన్ల పాలనతో అఫ్ఘానిస్తాన్ కునారిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం సాయాన్ని నిలిపివేయడంతో ఆర్థికపరిస్థితి పూర్తిగా దిగజారింది.ఉపాధి లేక భార్యా పిల్లల కడుపు నింపేందుకు అఫ్గానీలు.. అవయవాలను అమ్ముకుంటున్నారు.ఇక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేదరికంలోకి జారిపోయింది. ప్రజల్లో చాలా మందికి ఉపాధి కరువైంది. పనులు దొరక్కపోవడంతో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు అవయవాలను సైతం అమ్ముకునే దౌర్భాగ్యస్థితికి చేరారు ఆఫ్గనీలు. ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్లోని హెరాత్ ప్రాంతానికి చెందిన చాలా మంది …కుటుంబానికి తిండి పెట్టలేక కిడ్నీలు అమ్ముకుంటున్నారు.
గతేడాదిలో 85కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు చేశారు వైద్యులు. కిడ్నీలు అమ్ముకునే వాళ్ల ఆర్ధిక పరిస్థితుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం లేదని..దాత, కొనుగోలుదారుల ఒప్పందంతోనే మూత్రపిండాల ఆపరేషన్లు చేస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు.అయితే కిడ్నీలను అమ్ముకునేందుకు వస్తున్న వాళ్లంతా తమ తాత్కాలిక ఆర్ధిక అవసరాలను మాత్రమే చూసుకుంటున్నారని..ఆపరేషన్ తర్వాత తలెత్తే శాశ్వత అనారోగ్య సమస్యలను ఆలోచించడం లేదని డాక్టర్లు వాపోతున్నారు. ఆఫ్గానిస్తాన్లో రోజురోజుకూ నిరాశ్రయుల సంఖ్య పెరిగిపోతోంది.
గతేడాది ఆగస్ట్ నెలలో అమెరికా, నాటో దళాలు అఫ్ఘనిస్తాన్ని వదలివెళ్లడంతో అక్కడ తాలిబాన్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే తాలిబన్లు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో అంతర్జాతీయ సమాజం …ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు ఎలాంటి సహాయ, సహకారాలు ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్లో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అఫ్ఘానిస్తాన్, పొరుగు దేశాలకు ఐక్యరాజ్యసమితి కొద్దిపాటి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
