ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం’ (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై తన సూపర్ హిట్ సినిమా ‘జెంటిల్ మేన్’కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్విట్టర్ లో ఒక కాంటెస్ట్ను నిర్వహించారు. #G2MusicDirector అనే హ్యాష్ ట్యాగ్ తో తన ‘జెంటిల్ మేన్ 2’ చిత్రానికి సంగీతం చేయబోతున్న లెజెండరీ సంగీతకారుడిని ఊహిస్తే ..అదృష్టవంతులైన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇస్తామని తెలిపారు
ఈ రోజు ‘జెంటిన్మేన్ 2’ సినిమాకు సంగీత దర్శకుడిగా స్వరవాణి కీరవాణి పనిచేస్తున్నారని నిర్మాత కుంజుమన్ ప్రకటించారు. అలానే త్వరలోనే బంగారు నాణేల విజేతలను కూడా తెలియచేస్తామని కుంజుమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కేటి కుంజుమన్ నిర్మించిన ‘జెంటిల్మేన్’ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణసింగ్ ప్రేమదాస హత్య ఆధారంగా సినిమా క్లైమాక్స్ ను తిరిగి రాయమని దర్శకుడు శంకర్కు సూచించినందుకు గాను నిర్మాత కుంజుమన్ లో క్రియేటివిటీ ఉందనే విషయం అనేక మందికి అప్పట్లో బోధపడింది. అయితే, 27 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు వేరే టీమ్తో సీక్వెల్ చేయనున్నారు నిర్మాత కుంజుమన్. ఈ సినిమాకు సంబందించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.