NTV Telugu Site icon

Hyderabad: బీజేపీ దిగ్గజాలకు నేడు యాదమ్మ చేతి వంటకాలు

Yadamma Min

Yadamma Min

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలు ఈరోజు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ఆయా ప్రముఖులంతా టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టైలులోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం. స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజైన ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం.

బీజేపీ దిగ్గజాలు టేస్ట్ చేయబోయే వంటకాల జాబితా
చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాలా కర్రీ, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర, మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీనా రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ

స్వీట్స్ జాబితా
బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు

స్నాక్స్
పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి

ఎవరీ యాదమ్మ?
యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు.