వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్రావును అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. నిత్యం కార్మికుల మధ్య ఉంటూ శ్రమజీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్ అని కొనియాడారు.
కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కనీసం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఉజ్వల్ పథకం కింద సిలిండర్లు ఇచ్చామని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదన్నారు. గ్యాస్ ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పోయ్యిల కట్టెలను కొంటున్నారని తెలిపారు. కార్మికులకు ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏడాదిలోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హరీశ్రావు వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
Asani Cyclone: తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ, చెన్నైలకు విమానాలు రద్దు