హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. #ShameOnYouKCR పేరుతో బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే… #EqualityforTelangana పేరుతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయంటే.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఏ రేంజ్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రాజెక్టులకు జాతీయ హోదా, యూనివర్సిటీల మంజూరు, విభజన హామీలు, నిధులు.. ఇలా అన్ని విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎర్రబెల్లి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సబితా ఇంద్రారెడ్డి, రంజిత్ రెడ్డి, వై.సతీష్రెడ్డి… ఇలా నేతలందరూ వరుస ట్వీట్లు చేశారు. అటు మోదీకి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ రాకుండా డమ్మీ నేతను పంపారంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మోదీని చూడగానే కేసీఆర్కు జ్వరం వచ్చిందని ఆరోపిస్తున్నారు.
