NTV Telugu Site icon

TRS Party: వరుస ఎన్నికల నేపథ్యంలో.. సోషల్ మీడియా వింగ్‌ని బలోపేతం చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ

Trs Party

Trs Party

TRS Party: ఈ ఏడాది చివరలో మునుగోడు ఉపఎన్నిక జరగొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఏడాది చివరలో అసెంబ్లీ ఎలక్షన్లు.. ఆ తర్వాత సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తన సోషల్‌ మీడియా వింగ్‌ని బలోపేతం చేస్తోంది. ఈ విభాగంలోకి మరింత మందిని తీసుకోవటంతోపాటు ఇప్పటికే ఉన్న వారియర్ల నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణా కార్యక్రమాల ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టింది.

తద్వారా బీజేపీ, కాంగ్రెస్‌ వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు ఇకపై మరింత సమర్థవంతంగా కౌంటర్‌ ఇవ్వనుంది. విపక్షాలు చేసే వివిధ ఆరోపణలను తిప్పికొట్టనుంది. తప్పుడు ప్రచారాలకు చెక్‌ పెట్టనుంది. ఈ మేరకు గులాబీ పార్టీ సామాజిక మాధ్యమ విభాగ నాయకత్వంతోపాటు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కి చెందిన ఐ-ప్యాక్‌ టీం సభ్యులు రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులను సోషల్‌ మీడియా వారియర్లుగా మలిచేందుకు ట్రైనింగ్‌ క్యాంపులను ప్రారంభించారు.

‘Aha’ Decision: ‘ఆహా’.. ఏం నిర్ణయం?. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్‌ రూట్‌లో పయనం

తెలంగాణ రాష్ట్ర (సమితి) ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు స్థాయిలోని ఓటర్ల వరకు ఎఫెక్టివ్‌గా తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఏవిధంగా వినియోగించుకోవాలనేదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ విధేయులు సహా పలువురిని గ్రూపులుగా ఏర్పాటుచేసి ట్రైనింగ్‌ ఇస్తున్నారు.

సోషల్‌ మీడియాను వాడుకోవటం ద్వారా బీజేపీ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఏవిధంగా లాభపడిందో, అధికార పార్టీ విజయవకాశాలను ఎలా దెబ్బకొట్టిందో వివరిస్తూ ఐ-ప్యాక్‌ ఒక రిపోర్టును టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో పింక్‌ పార్టీ డిజిటల్‌ డిపార్ట్‌మెంట్‌ అలర్ట్‌ అయింది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర సర్కారు ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్థానికులకు ఎప్పటికప్పుడు తెలియజేయటంపై దృష్టి పెట్టింది.

తద్వారా అపొజిషన్‌ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచార మాయలో ప్రజలు పడకుండా అప్రమత్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళుతూ, ప్రధాని మోడీ ఇమేజ్‌ని మరింత పెంచుతూ, కమలం పార్టీకి పొలిటికల్‌ మైలేజ్‌ని పెంచుతోంది. ఈ విషయాన్ని కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం తన ఆర్మీకి వివరిస్తోంది.

ఈ శిక్షణ తరగతులను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనుంది. అన్ని గ్రామాల్లోనూ టీమ్‌లను ఏర్పాటుచేయనుంది. తద్వారా స్టేట్‌-విలేజ్‌ లెవల్‌ సోషల్‌ మీడియా గ్రూపుల మధ్య సమన్వయాన్ని పెంచనుంది. కంటెంట్‌ను సత్వరం పరస్పరం షేర్‌ చేసుకోనుంది.