Revanth Reddy Targets KCR: కేసీఆర్‌ను నమ్మం.. మళ్లీ మోసపోం..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేయడం.. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాను డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మళ్లీ కేసీఆర్‌.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.. దీనిపై తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి.. మోసగాడికి బ్రాండ్ అంబసిడర్ కేసీఆర్‌ అని వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్‌ను కాంగ్రెస్ రెండు సార్లు నమ్మి మోసపోయిందని.. మళ్లీ కేసీఆర్‌ని నమ్మి మోసపోం అన్నారు.. కాంగ్రెస్‌ పార్టీ.. సీఎం కేసీఆర్‌ను నమ్మదని స్పష్టం చేశారు.

Read Also: Congress: కీలక నిర్ణయం.. నియామక ప్రక్రియకు స్వస్తి..!

మరోవైపు, బీజేపీ, టీఆర్ఎస్‌పై మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.. ఒకరి దొంగ తనం ఒకరి దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.. ఎవరైనా బయట పెట్టారా..? అని ప్రశ్నించారు.. బీజేపీ, టీఆర్ఎస్‌ తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నాయన్న ఆయన.. కేంద్రంలో అవినీతి బయట పెడతా అంటే ఎవరు వద్దని అన్నారు? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.. రఫెల్ మీద మేం మాట్లాడినప్పుడు కేసీఆర్‌ ఎందుకు మాట్లడలేదని నిలదీసిన ఆయన.. ఇద్దరూ తోడు దొంగలు.. ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుని బతకాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ మాకు సమాన దూరం.. మా ఇంటి కాకి కేసీఆర్‌ ఇంటి మీద వాలదు.. వాలింది అంటే కాల్చి పడేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి.