హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో భారీ మారథాన్ జరగనుంది. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కిలోమీటర్ల మారథాన్ను నిర్వహించనున్నారు. ఈ మారథాన్కు ఇప్పటికే 6వేల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ 10వ ఎడిషన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. దీంతో పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు.
Read Also: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
కాగా కరోనా మహమ్మారి కారణంగా ఏడాది విరామం తర్వాత ఈ మారథాన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఈ మారథాన్ను ఆగస్టు నెలలో నిర్వహిస్తామన్నారు. మారథాన్లో పాల్గొనేవారి భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రిజిస్టర్ చేసుకున్నవారు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందన్నారు. మారథాన్లో పాల్గొనేవారు సామాజిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు.