Smart Ration Cards : గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

  • ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం
  • 1.05 కోట్ల రేషన్ కార్డులు.. 3.42 కోట్ల మందికి లబ్ధి
  • వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు
  • పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్స్
Smart Ration Cards

Smart Ration Cards

Smart Ration Cards : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని రాబోయే ఆగస్టు 15న వైభవంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సురక్షితమైన, ట్యాంపర్‌ ప్రూఫ్‌ లామినేటెడ్ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సిద్ధం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఒకేసారి ఈ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.

 

ఈ కొత్త కార్డుల మంజూరుతో రాష్ట్రంలో ఆహార భద్రత పరిధి మరింత విస్తరించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయగా, అదనంగా 61.09 లక్షల మంది లబ్ధిదారులు ఈ పరిధిలోకి వచ్చారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరి, దాదాపు 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత లభిస్తోంది. దీనికి అనుగుణంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది.

 

ఈ భారీ పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేందుకు కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాల్లో పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటూ, ముందుగానే లబ్ధిదారుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెళ్లను సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , స్థానిక ప్రజాప్రతినిధులందరినీ ఇందులో భాగస్వాములను చేస్తూ, ఈ ప్రక్రియ ప్రతిరోజూ సక్రమంగా జరిగేలా సీనియర్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి పర్యవేక్షిస్తున్నారు.