తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను మరో కొన్ని రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఊరట పొందారు. వాస్తవానికి పాఠశాలలు జూన్ 13 నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఆ రోజు రెండో శనివారం కావడంతో సెలవు ఉంటుంది. అలాగే జూన్ 14 ఆదివారం కూడా కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం షెడ్యూల్లో మార్పులు చేసింది.
తాజా నిర్ణయం ప్రకారం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులకు మరో రెండు రోజుల అదనపు సెలవులు లభించాయి. అయితే విద్యా సంవత్సరంలో పనిదినాల సంఖ్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జూన్ 13న రెండో శనివారం సెలవు ఇచ్చినందుకు బదులుగా జులై 11న (రెండో శనివారం) పాఠశాలలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
వేసవి తీవ్రత, వరుస సెలవులు, విద్యా క్యాలెండర్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 15 నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.

