NTV Telugu Site icon

భారత్‌కు విద్యుత్‌ గండం..! తెలంగాణ మాత్రం సేఫ్‌..!

చైనా పెద్ద సంక్షోభంలో పడిపోయింది… తీవ్రమైన కరెంట్‌ కోతలతో అల్లాడిపోతోంది.. అయితే, ఇప్పుడు భారత్‌కు కూడా విద్యుత్‌ ఉత్పత్తి, కరెంట్‌ కోతల ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఈ పరిస్థితి దాపురిస్తోందని భయాలు వెంటాడుతున్నాయి.. మరి, తెలంగాణలో పరిస్థితి ఏంటి..? అనే చర్చ మొదలైంది. దీనిపై విద్యుత్‌ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.. దేశంలోనే సేఫ్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణగా వెల్లడించారు. సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్ రావు తీసుకున్న నిర్ణయంతో మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకి ఎలాంటి ఆటంకాలు లేవని.. హైడల్ పవర్ లో దేశంలో ఎక్కడ లేనివిధంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణగా క్లారిటీ ఇచ్చారు. హైడల్ పవర్ ఉత్పత్తి లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంటంకం వచ్చేదన్నారు.

సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇవాళ హైడల్ పవర్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని వివరించింది విద్యుత్‌శాఖ.. ఇక, థర్మల్ విద్యుత్ లోను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది జెన్కో… 15 రోజుల వరకు సరిపోను బొగ్గు నిల్వలు ఉన్నాయని.. గ్రిడ్ ఆపరేషన్ బాగా వర్క్ చేస్తుందని తెలిపారు. మరోవైపు ఉత్తర భారతదేశంలో కోల్ సమస్య బాగా ఉంది.. కోల్ సమస్యల వల్ల గ్రిడ్ కుప్పకూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించిన అధికారులు.. గ్రిడ్ ఫెయిల్ అయితే దాదాపు 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, దసరా పండుగకు ముందు ఉత్తర భారత దేశంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. విద్యుత్ కోతలు పెట్టకపోతే గ్రిడ్ కుప్పకూలే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.. రానున్న వారం పది రోజుల్లో ఉత్తర భారతం చీకట్లో మగ్గే అవకాశం పొంచి ఉందని వార్నింగ్‌ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలు సీఈఏ గైడ్ లైన్స్ పాటించకపోవడమే ఈ బొగ్గు నిల్వలు తగ్గుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు అధికారులు.