Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!

  • NEHS ముసాయిదా మార్గదర్శకాలు విడుదల
  • రూ. 5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
  • డిజిటల్ హెల్త్ కార్డులు, కొత్త వెల్‌నెస్ సెంటర్లు
  • ఉద్యోగులు, పెన్షనర్లకు 1.5% చందాతో ఆరోగ్య భద్రత
Tg Logo

Tg Logo

Telangana : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. లబ్ధిదారులందరికీ నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడానికి రూపొందించిన ఈ పథకం డిజిటలైజేషన్, క్యాష్‌లెస్ చికిత్సలు , పక్కా నిధుల నిర్వహణతో కూడిన సమగ్ర వైద్య రక్షణను అందిస్తుంది.

పథకం అర్హత , డిజిటల్ కార్డుల జారీ

ఈ నూతన ఆరోగ్య పథకం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు , వారిపై ఆధారపడిన అర్హులైన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. లబ్ధిదారుల గుర్తింపును పారదర్శకంగా మార్చడానికి IFMIS వ్యవస్థ ఆధారంగా డిజిటల్ నమోదు చేపట్టి, ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తారు. సేవలను లబ్ధిదారులకు మరింత వేగంగా చేరవేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లకు అదనంగా మరో 25 కొత్త వెల్‌నెస్ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.

నగదు రహిత చికిత్సలు , అత్యవసర వైద్యం

వెల్‌నెస్ సెంటర్లు , ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న (ఎంపానెల్డ్) ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా లబ్ధిదారులకు పూర్తిగా నగదు రహిత వైద్య సేవలు అందుతాయి. ఔట్‌పేషెంట్ (OP), ఇన్‌పేషెంట్ (IP) చికిత్సలతో పాటు వివిధ రకాల నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్సలు, ఉచిత మందుల సరఫరా , అత్యవసర సేవలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు రిఫరల్ పత్రాలు లేకపోయినా నేరుగా సమీపంలోని ఎంపానెల్డ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందవచ్చు. అంతేకాకుండా, నిర్దిష్ట నిబంధనలకు లోబడి రాష్ట్రం వెలుపల పొందే అత్యవసర చికిత్సలకు కూడా ఈ పథకం కింద అనుమతి లభిస్తుంది.

ఖర్చు పరిమితి , రూమ్ కేటాయింపు నిబంధనలు

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ₹5 లక్షల వరకు అయ్యే చికిత్సలకు పూర్తిగా నగదు రహిత సదుపాయం కల్పిస్తారు. ఒకవేళ చికిత్స ఖర్చు ₹5 లక్షలు దాటితే, ఆ పైన అయ్యే మొత్తాన్ని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ప్రత్యేకంగా పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక చికిత్స ప్యాకేజీ ధరలను CGHS ప్యాకేజీల ఆధారంగా అమలు చేస్తారు. ఆసుపత్రిలో గదుల కేటాయింపు ఉద్యోగులు లేదా పెన్షనర్లు చెల్లించే నెలవారీ చందాపై ఆధారపడి ఉంటుంది. నెలకు ₹1,000 వరకు చందా చెల్లించే వారికి సెమీ-ప్రైవేట్ లేదా షేరింగ్ గది కేటాయిస్తే, ₹1,000 కంటే ఎక్కువ చందా చెల్లించే లబ్ధిదారులకు ప్రైవేట్ లేదా సింగిల్ గదిని పొందే అర్హత ఉంటుంది.

ఫండ్ నిర్వహణ , ఐటీ ఆధారిత పారదర్శకత

ఈ పథకానికి అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో (Basic Pay) 1.5% , పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్‌లో 1.5% చొప్పున నెలవారీ చందాను సేకరిస్తారు. దీనికి సమానమైన మొత్తాన్ని (Matching Contribution) ప్రభుత్వం కూడా తన వాటాగా జమ చేస్తుంది. ఈ నిధుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘EHCT ట్రస్ట్ ఫండ్’ ఏర్పాటు చేయబడుతుంది. ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్, క్లెయిమ్‌ల సత్వర పరిష్కారం, మెడికల్ ఆడిటింగ్ , ఫిర్యాదుల పరిష్కారానికి పక్కా విధివిధానాలు అమలు చేయనున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్, ఆన్‌లైన్ క్లెయిమ్ విధానం వంటి ఐటీ వ్యవస్థల ద్వారా ఈ పథకం నిర్వహణను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇవి ప్రభుత్వ పరిశీలనలోని ముసాయిదా (Draft) మార్గదర్శకాలు మాత్రమే కాగా, తుది ఆమోదం , అధికారిక ఉత్తర్వుల అనంతరం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి.