తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) అందించిన అధికారిక గణాంకాల ప్రకారం, శనివారం ఉదయం 08:30 గంటల నుండి ఆదివారం ఉదయం 06:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మహబూబాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షపాతం
రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 191.0 మిమీ (19.1 సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని నెల్లికుదురులో 151.5 మిమీ, నర్సింహులపేట (కొమ్ములవంచ)లో 140.0 మిమీ, మునిగలవీడులో 119.8 మిమీ , అమ్మనగల్లో 110.5 మిమీ చొప్పున భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కూడా 149.0 మిమీ తీవ్ర వర్షపాతం రికార్డయింది. ఉమ్మడి మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన ఈ కుండపోత వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
యాదాద్రి భువనగిరి, వరంగల్ , ఇతర జిల్లాల్లో తీవ్రత
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ (దత్తప్పగూడ)లో 142.3 మిమీ, రామాన్నపేటలో 127.5 మిమీ, చౌటుప్పల్లో 120.5 మిమీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా రాయపర్తిలో 128.8 మిమీ, వర్ధన్నపేటలో 123.5 మిమీ, పర్వతగిరి (కల్లెడ)లో 105.5 మిమీ వర్షం పడగా, జనగామ జిల్లా కొడకండ్లలో 126.3 మిమీ, దేవురుప్పులలో 115.3 మిమీ వర్షం రికార్డైంది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 125.0 మిమీ వర్షపాతం రికార్డు కాగా, సూర్యాపేట జిల్లా అర్వపల్లి, నాగారంతో పాటు కుమురం భీమ్ జిల్లా వంకులం ప్రాంతాల్లోనూ 100 మిమీ దాటి వర్షపాతం నమోదైంది.
ప్రయాణికులు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు చేరడం, జాతీయ రహదారులపై ద్రుశ్యమానత (Visibility) తగ్గడంతో ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలోని చౌటుప్పల్, చిట్యాల పరిసర ప్రాంతాల్లో వెళ్లే వాహనదారులు తీవ్ర అప్రమత్తత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ , ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను స్థానిక యంత్రాంగం అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టింది.

