తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు. ఈ మేరకు వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాలలో పర్యటించిన కేసీఆర్.. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తి పోతల పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర అనే రెండు ప్రాజెక్టు నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చనున్నాయి.
కాగా ఈ రెండు ప్రాజెక్టులకు కాళేశ్వరం మెగా ప్రాజెక్ట్ నుంచి దాదాపు 20 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టుల శంకుస్థాపన తర్వాత సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదివారంమహారాష్ట్ర పర్యటనకు వెళ్లి.. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న కేసీఆర్ ఈ బహిరంగ సభలో ఏం మాట్లాడుతారో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
