ఓయూలో సమాధి కలకలం..!

ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో సమాధి కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం కాలేజీ హాస్టల్‌ వెనుక స్థలానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు సమాధి కనిపించడంతో భయంతో హాస్టల్‌ కు పరుగులు తీశారు. అనంతరం.. ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పారు. అక్కడితో ఆగని ఆ విషయం… చీఫ్‌ వార్డెన్‌ దృష్టికి వెళ్లింది. సమాధిలో జంతువునా.. మనిషిని పూడ్చి పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది.

సమాధిపై చల్లిన పూలు తాజాగా ఉండగా… ఇటీవలే తవ్వి పూడ్చినట్లుగా ఆ సమాధి ఉంది. ఓయూలోకి బయటి వ్యక్తులు రాకుండా కొత్త సెక్యూరిటీతో పటిష్ట బందోబస్తు చేశామని… రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీ… పెట్టామని.. అధికారులు చెపుతుండగా… మరోవైపు క్యాంపస్‌ లో సమాధి కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.