చెడు సావాసాలు ఎంతటి వ్యసనాలకు గురిచేస్తాయో, ఆ వ్యసనాలు ఉన్నతమైన భవిష్యత్తును ఎలా బుగ్గిపాలు చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల్లో సంపాదిస్తూ, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాల్సిన ఒక యువకుడు గంజాయికి బానిసై, చివరకు తన ఇంటిపైనే గంజాయి తోట పెంచుతూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చిక్కాడు.
సిహెచ్. శశిధర్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించినప్పుడు అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఉద్యోగ రీత్యా ఏర్పడిన స్నేహాలు అతడిని గంజాయి వైపు మళ్లించాయి. వచ్చిన జీతాన్నంతా గంజాయి కోసమే తగలేస్తూ, క్రమంగా ఆ వ్యసనానికి పూర్తిగా బానిసయ్యాడు. ఆ మత్తులో పడి తన చేతిలో ఉన్న గౌరవప్రదమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు.
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
ఉద్యోగం పోవడంతో గంజాయి కొనుగోలు చేయడానికి డబ్బులు లేక శశిధర్ ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. బయట కొనే అవసరం లేకుండా తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. నమ్మదగిన సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ‘ఏ’ టీమ్ సీఐ బాలరాజు నేతృత్వంలో నాచారంలోని ఈస్ట్ గాంధీనగర్ లో ఉన్న శశిధర్ ఇంటిపై మెరుపు దాడి చేశారు.
ఈ దాడిలో అధికారులు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇంటిపై ఏకంగా 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొన్ని మొక్కలు అప్పటికే పూతకు రాగా, మరికొన్ని మూడు మీటర్ల ఎత్తు వరకు పెరిగాయి. వీటి ద్వారా సుమారు 10 కిలోల గంజాయి లభించే అవకాశం ఉందని సీఐ బాలరాజు అంచనా వేశారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
ఇదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ మరో కీలక దాడులు నిర్వహించింది. మేడపాటి నగర్లో బి.టెక్ చదువుతున్న విద్యార్థులు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు జరిపి బండి అరుణ్ కుమార్, బి. ఆశిష్ అనే ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన విద్యార్థులు ఇలా ఈజీ మనీ కోసం గంజాయి విక్రేతలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
సమర్థవంతంగా దాడులు నిర్వహించి గంజాయి సాగును, విక్రయాలను అరికట్టిన సీఐ బాలరాజు , వారి బృందాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్, ఈఎస్ జీవన్ కిరణ్లు ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
