తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రద్ద చేసిన ఈ వ్యవస్థపై రెవెన్యూ సంఘం మాజీ నేత లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిన రోజు ఇదని, ఐదు వేల మంది జీవితం నాశనం అయ్యిందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదని, ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థ… ఈ వ్యవస్థను సక్రమంగా చూసుకుంటే ప్రభుత్వం బాగుంటుందని ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పేవారన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన 22 నెలల తర్వాత ఎవర్ని సంప్రదించకుండా ఇతర శాఖల్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. రెవెన్యూ వ్యవస్థలో మేము చేసిన తప్పేంటో చెప్పాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేదన్నారు. రెవెన్యూ వ్యవస్థను అనాథను చేశారు. ఏదో సాధిస్తామని ధరణి వెబ్సైట్ తెచ్చారు. ఇప్పటికి పుంకాను పుంకాల ఫిర్యాదులు వస్తున్నాయి. వ్యవస్థలో ఏం జరుగుతుందో మాకు తెలుసు.
అన్ని బయట పెడతాం.. ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీయగలం. ఎన్నికల సమయంలో మా సత్తా చాటుతం. వేలాది పోలింగ్ స్టేషన్లు మా చేతుల్లోనే ఉంటాయి. ప్రభుత్వాన్ని కూలదోయడంలో రెవెన్యూ వ్యవస్థ కీలకం. 121 జీవోను వెంటనే రద్దు చేయాలి. ధరణి విషయంలో ఐఏఎస్ కూడా కంప్యూటర్ ఆపరేటర్ మీద ఆధార పడుతున్నారు. అందర్ని వేలిముద్ర వాళ్ళను చేశారు. సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. నువ్వు ఏం చేయగలవ్.. మహా అయితే ఎసిబి, ఇతర సంస్థలతో దాడులు చేయించగలవ్.. ఉద్యోగస్తులను ఉద్యోగంలో నుంచి పీకగలవా? నీకు అంత దమ్ము ఉందా? 15 రోజుల్లో జీవో వెనక్కి తీసుకోకపోతే రెవెన్యూలో సమ్మె చేపడతామని ఆయన వెల్లడించారు.
