Sridhar Babu : హైదరాబాద్‌లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు

  • హైదరాబాద్‌ను ఎంపిక చేసిన బయోటెక్ దిగ్గజం రీజెనరాన్
  • అమెరికా వెలుపల తొలి జిసిసి తెలంగాణలోనే : శ్రీధర్ బాబు
  • రీజెనరాన్ జిసిసితో భారీగా ఉద్యోగావకాశాలు
  • ఐటి, డేటా సైన్స్, ఏఐ రంగాల్లో కొత్త అవకాశాలు
Sridhar Babu

Sridhar Babu

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ , బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ దిగ్గజమైన ‘రీజెనరాన్’ (Regeneron) సంస్థ తన సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకుంది. అమెరికా వెలుపల ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి జిసిసి కేంద్రం తెలంగాణలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారికంగా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కాబోతున్న ఈ రీజెనరాన్ జిసిసి కేంద్రం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరగడమే కాకుండా, స్థానిక యువతకు ఐటీ, డేటా సైన్స్, క్లినికల్ ట్రయల్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి కంపెనీలకు హైదరాబాద్ ఇప్పుడు ‘ఫస్ట్ ఛాయిస్’గా మారిందని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నగరంలో ఇప్పటికే 450కి పైగా అంతర్జాతీయ జిసిసి కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయని, దేశంలోనే జిసిసిల హబ్‌గా హైదరాబాద్ ద్వితీయ స్థానంలో దూసుకుపోతోందని ఆయన గుర్తు చేశారు. బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాలకు తెలంగాణ ఒక బలమైన కేంద్రంగా నిలిచిందని, జీనోమ్ వ్యాలీ విస్తరణతో పాటు త్వరలోనే ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఫార్మా సిటీ’ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ అనుకూల వాతావరణం వల్లే అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఈ రీజెనరాన్ జిసిసి కేంద్రం కేవలం ఒక కార్యాలయంగానే కాకుండా, అత్యాధునిక డిజిటల్ సేవలు అందించే ప్రత్యేక హబ్‌గా పనిచేయనుంది. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ రంగానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్ డేటా నిర్వహణ, అడ్వాన్స్‌డ్ ఏఐ ఇంజినీరింగ్, డేటా సైన్స్ పరిశోధనలు ఇక్కడి నుంచే సాగనున్నాయి. బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి సాంకేతికతను హైదరాబాద్‌కు తీసుకురావడంలో రీజెనరాన్ రాక ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇది భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు దారి తీస్తుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.