అగ్నిపథ్కు వ్యతిరేకంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్కు చెందిన రాకేశ్ మృతిచెందాడు. వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. పోచం మైదాన్ కూడలి మీదుగా రాకేశ్ అంతిమ యాత్ర సాగుతోంది.
కాగా… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళనలో మృతి చెందిన ఆర్మీ అభ్యర్థి రాకేష్ మృతదేహం ఉదయం వరంగల్ ఎంజీఎంకు చేరుకుంది. ఎంజీఎం మార్చురీలో మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతిమ యాత్రలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, వామపక్షపార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖానాపూర్ మండలంలో దబీర్ పేట గ్రామంలో రాకేశ్ అంత్యక్రియలు పూర్తవుతాయి.