Site icon NTV Telugu

Power Charges Effect: మూలిగే మెట్రో బండిపై… విద్యుత్ ఛార్జీల బండ

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్ల మెట్రో ప్రయాణికులపై అదనపు భారం పడబోతోందా? విద్యుత్‌ ఛార్జీల పెంపునకు మెట్రో ప్రయాణాలకు సంబంధం ఏంటి? ఎల్‌ ఎండ్‌ టీ ఏమంటోంది? తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని ఇప్పటికే డిస్కంలు ప్రతిపాదించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూనిట్ ఛార్జీ 4 రూపాయల 95 పైసలు అవుతుంది. డిమాండ్ ఛార్జీలు ప్రతి కెవిఏకి 85 రూపాయల పెంపుతో 475 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ ప్రకారం ప్రతి యూనిట్ ఛార్జీ 6 రూపాయల 57 పైసలు అవుతుందని ఎల్‌అండ్‌టి ఈఆర్సీకి ఇచ్చిన అభ్యంతరాల్లో తెలిపింది.

ఇటు చూస్తే మెట్రో పూర్తిగా విద్యుత్‌తో నడుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం కారణంగా యూనిట్ ఛార్జీని 3 రూపాయల 95 పైసలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఛార్జీలు ప్రతి కేవిఏకి 390 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి యూనిట్ ఛార్జీ 5 రూపాయల 28 పైసలు పడుతోందని మెట్రో అంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూపాయి పెంపుతో యూనిట్ ఛార్జీ 4 రూపాయల 95 పైసలు అవుతుంది. అదనంగా యూనిట్‌పై 1 రూపాయి 29 పైసలు పెరుగుతోంది. ఇది తమకు భారమని ఎల్‌అండ్‌టీ వాదిస్తోంది. దీనివల్ల టికెట్ ధరలను పెంచాల్సి ఉంటుందని తెలిపింది.

భారీగా కరెంట్ ఛార్జీల పెంపుతో మెట్రో నిర్వహణ వ్యయం 25 శాతం పెరుగుతుందన్నది ఎల్‌ అండ్‌ టీ వాదన. కొవిడ్ కారణంగా ఇప్పటికీ 25 శాతం ఆక్యుపెన్సీతో మెట్రోరైలు నడుపుతున్నామని ఈఆర్సీకి ఇచ్చిన అభ్యంతరాల్లో తెలిపాయి.

కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఆమోదిస్తే ఆ భారం మెట్రోరైలు ప్రయాణికులపై వేయాల్సి వస్తోందని తేల్చి చెప్పింది. మెట్రోకి కాస్ట్ టూ సర్వీసు ఇవ్వాలన్న ఒప్పందం ఉందని గుర్తు చేసింది ఎల్‌ అండ్‌ టీ. ఆప్రకారం యూనిట్‌ ఛార్జీలు ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. దీనిపై ఈఆర్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

https://ntvtelugu.com/harish-rao-started-telangana-health-profile/
Exit mobile version