NTV Telugu Site icon

లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంక్‌ల‌కు మిన‌హాయింపు

petrol bunk

క‌రోనా క‌ట్ట‌డి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది.. ఇక‌, ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డం.. ఉత్త‌ర్వులు రావ‌డం అన్ని జ‌రిగిపోయాయి.. తాజాగా పెట్రోల్ బంక్‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది స‌ర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా ప‌నిచేయ‌నున్నాయి. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని గ‌తంలో పేర్కొంది ప్రభుత్వం. కానీ, అత్య‌వ‌స‌ర సేవ‌లు, లాక్‌డౌన్‌లో మిన‌హాయింపు ఉన్న‌వారికి ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది… ఓవైపు ధాన్యం సేకరణ జోరుగా సాగుతోంది. దీనివల్ల ట్రక్కులు రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించాల్సిన అవసరం ఉంది. పైగా వ్యవసాయ పనుల కోసం పెట్రోల్‌, డీజిల్ ఎంతో అవ‌స‌రం.. దీంతో.. ప్రభుత్వం పెట్రోల్‌ పంపులకు సంబంధించి నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో.. పట్టణాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రోల్ బంక్‌లు ఎప్ప‌టిలాగే సాధార‌ణంగా ప‌నిచేయ‌నున్నాయి. దీంతో.. వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన‌ట్టు అయ్యింది.